5, మే 2022, గురువారం

 రేపటి రోజు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల యొక్క ఆవిర్భావ దినం. ఇది సనాతన ధర్మం అంతటికీ పండుగరోజు. 


 ఎంతవరకూ దేహమే నేను అనే భావం ఉంటుందో అంతవరకూ వైదికమైన సత్కర్మలు ఆచరించాలి. 

షణ్మతాలూ ఈ మూడు సిద్ధాంతాలతో ఉంటాయి. 

ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు X షణ్మతములు = హిందూ ధర్మం యొక్క స్వరూపం.


అద్వైతం అనే ఒకానొక జ్ఞానం భూమికగా కలిగి ఉన్నట్లయితే పరస్పర వైరములు లేకుండా ఉంటాయి. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైతం ప్రతిష్ఠాపన చేస్తూ “ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్త్వము. జీవుడికి కూడా దేహాత్మ భ్రాంతి ఉన్నంతవరకే భేదం కానీ అది తొలగించి చూస్తే సత్య దృష్టితో అద్వైతమే” అని చెప్పారు. 

వ్యవహారంలో అద్వైతం కుదరదు, ద్వైతమే ఉంటుంది. పరమార్థంలోనే అద్వైతం. పారమార్థిక దృష్టి కలిగి వ్యవహార జీవనంలో ఉన్నప్పుడు అద్వైత స్పృహలోనే ద్వైత జగత్తులో ఉంటాం. దీనివల్ల సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది. 


సిద్ధాంతాలు అర్థం అయినా అవకపోయినా శంకర సిద్ధాంతంలో ఉన్న వారికి ఎవరి ఇష్టదేవతలు వారికి ఉన్నా ఇతర దేవతలను ద్వేషించరు. అది ఒక్కటి చాలు ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పద్ధతి. 


వైష్ణవంలోను, శైవంలోనూ మహాత్ములు, ఉద్దండులూ ఉద్భవించారు. గొప్పగొప్ప భక్తులు ఉన్నారు. వారు ముక్తజీవులే. కానీ వారి అనుయాయులం అని చెప్పుకొనే వారిలో ప్రస్తుతం ఉన్నవారు శివద్వేషం వైష్ణవంగాను, విష్ణుద్వేషం శైవంగాను, చలామణి అవుతోంది. వీరికి ఇతర మతముల పట్ల విపరీతమైన ద్వేషం. 


చాలామందికి శంకరాచార్య అంటే శైవుడని, రామానుజాచార్య అంటే వైష్ణవుడనీ, ఒకానొక భ్రమ బాగా ఉంది. రామానుజులు కేవల వైష్ణవ మతస్థులు అనడంలో ఏమీ సందేహం లేదు. ఆయన ఇతర దేవతలను ప్రశంసించరు. మీదు మిక్కిలి వారి అనుయాయులు శివాదులను ద్వేషించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇతర దేవతలు అంటే వారికి గిట్టదు. అవమానంగానే చూస్తారు. తపనిసరియై నోరుమూసుకున్నప్పటికీ మనస్సు నిండా కించపరచే భావమే వారికి ఉంటుంది. 


శంకరాచార్య శైవులు కాదు. ఆయన శివాంశ సంభూతులు అని శంకర విజయాలు చెప్పాయే తప్ప ఆయన శైవుడు కాదు. 

వైదిక శైవం గురించి చెప్పాలంటే శ్రీకంఠాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు మొదలైన వాళ్ళు ఇచ్చారు.

శైవం వేరు, వైష్ణవం వేరు, శాక్తేయులూ ఉన్నారు. వారందరూ ఆగమ మతాలు. కానీ శంకరాచార్యులు వీటి వేటికీ చెందరు. ఆయనకి శివుడు, విష్ణువు, భేదం లేదు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. కానీ భక్తులు ఉపాసనా సౌలభ్యం కోసం ఆయన అనేక రూపాలు స్వీకరిస్తాడు. విష్ణువు, శివుడు ఒకే పరమాత్మ నామములే. ఆ పరమాత్మ ప్రతి జీవుడిలో అంతర్యామియే. తత్త్వతః తెలుసుకోగలిగితే జీవుడికీ పరమాత్మకీ భేదం లేదు. ఇది శంకర సిద్ధాంతం.

శంకరులు ఎప్పుడూ శైవం కాదు, ఇది ముందు తెలుసుకోవాలి. 

ఈ వైష్ణవం అనుకొనే ఇతర దేవతా ద్వేషం కలిగినటువంటి వారు శంకరులు శైవులు అని ఒక ముద్ర వేస్తున్నారు. శంకరుల ధర్మంలో శైవం, వైష్ణవం అన్నీ కలిసి ఉంటాయి. షణ్మత ప్రతిష్ఠాపనాచార్య అనే పేరు కూడా ఉన్నది. 


ప్రస్తుతం సనాతనధర్మం కలిసికట్టుగా ఉండాలంటే ఎవరి సంప్రదాయం వారు పాటించాలి. ఇతర సంప్రదాయాలను గౌరవించాలి. ఇది సత్సంప్రదాయం. చాలా అవసరం. 


వైష్ణవులు వైష్ణవంలో ఉన్న వారికి వైష్ణవ ధర్మాలను బోధించడం చేయాలి. ఇతరులకి విష్ణుభక్తిని బోధించాలి. అలాగే శైవులు కూడా శైవసంప్రదాయంలో ఉన్నవారికి శైవ దీక్షలు ఇప్పించవచ్చు. ఇతరులకు శివభక్తి బోధించవచ్చు. కానీ అందరు దేవతలను ఆరాధించుకొనే సంప్రదాయంలో ఉన్నవారిని బలవంతంగా మార్చి, వారికి శివుడి ఆలయాలకు వెళ్ళవద్దు, శివపూజలు చేయవద్దు, శివుడు అంటే అష్టదిక్పాలకులలో ఒకడు, ఏకాదశ రుద్రులలో ఒకడు అంటూ కించపరచి మాట్లాడడం జరుగుతోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. 

ఇతరులు మన దేవతలను అవమానిస్తూ మతమార్పిడులు చేయడం ఎలాంటిదో మన మతంలో ఉపమార్పిడులు కూడా అటువంటివే. 


రాజకీయ ప్రాపకాలు, ప్రభుత్వ అండదండలు దగ్గర పెట్టుకొని ఇలాంటి దాష్టీకాలు చేస్తూ సనాతన ధర్మంలో చీలికలు ఎవరైతే తీసుకువస్తున్నారో వాళ్ళు జగద్గురువులు అనడానికి లేదు. వాళ్ళ శాఖకి వాళ్ళు గురువులు అంతే.


సనాతన ధర్మం వేదంలోనుంచి వచ్చిన ఆరుమతాలనూ చూపిస్తూ ఎవరి దేవతలను వారు ఆరాధించుకోండి, ఇతరులను గౌరవించండి.


హిందూధర్మం మొత్తానికి ఒక గురువును చెప్పుకోవాలంటే ఆ గురువు ఆదిశంకర భగవత్పాదులు మాత్రమే. ఆయన వచ్చిన తరువాతనే అవైదిక మతాల ధాటికి చెదిరిపోయినటువంటి శైవవైష్ణవాదులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. అందుకే ఆయనని “షణ్మతప్రతిష్ఠాపనాచార్య’ అన్నారు. 


సనాతన హిందూ ధర్మానికి సమగ్రమైనటువంటి జగద్గురువులుగా ఆదిశంకరులను గౌరవిస్తూ వారి సంప్రదాయ గురువులను గౌరవించుకోవచ్చు. తప్పులేదు. 

 అన్ని రకాల సంప్రదాయాలు ఆ సంప్రదాయంలోని గురువుల వల్లనే పుష్టి పొందాయి. ఈ సంప్రదాయాలన్నింటినీ గౌరవించడం అనే సంప్రదాయం మాత్రం జగద్గురువులు ఆదిశంకర పరంపరలో ఉంది నేటికి కూడా. శంకర పీఠములన్నింటిలోని వారూ ఇటువంటి సామరస్య ధోరణితో ఉన్నటువంటి వారే. పీఠ పరిపాలిత దేవాలయాలలోనూ హైందవ దేవతలందరూ ఆరాధింపబడుతూ ఉన్నారు. నారాయణ స్మరణ, చంద్రమౌళీశ్వరారాధన, శ్రీచక్రార్చన చేస్తారు. సనాతనధర్మం యొక్క స్వరూపం ఇది. 


ప్రతి సంప్రదాయం వాళ్ళూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారి సంప్రదాయం వదులుకోకుండా ఇతర సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. విష్ణువే గొప్ప శివుడు కాదు అని వాళ్ళ గ్రంథాలను భుజాన మోసుకొని ఎలా తిరుగుతున్నారో, శివుడు తప్ప ఇంకెవరూ గొప్ప కాదు అని చెప్తూ గ్రంథములు మోసుకు తిరగడానికి వాళ్ళూ సిద్ధంగా ఉన్నారు. ఏ నూతిలో మండూకానికి ఆ నూతి లోతు తెలిసినట్లు ఏ సంప్రదాయజ్ఞుడికి ఆ సంప్రదాయపు లోతు తెలుస్తుంది. తమకు తెలియని సంప్రదాయాల గురించి అవహేళనగా, కించపరచి మాట్లాడరాదు. సందర్భం వస్తే అది మా సబ్జెక్ట్ కాదు అని నమస్కారం చేయడం చాలా మంచిది.  


సనాతనధర్మం పరస్పర ద్వేషాలు, చీలికల జోలికి వెళ్ళకుండా సమన్వయ ధోరణిలో వెళ్ళాలి అని ఒక సంకల్పం తీసుకోవాలి. ఇక ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాల గొడవ పండితులు ఎలాగూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. సామాన్యులకి అవి అవసరం లేదు. ధర్మము, భక్తి – ఈ రెండూ చాలా ప్రధానం. 


మనది మనం పాటిద్దాం, ఇతరులను గౌరవిద్దాం. ఈ సంప్రదాయాన్నిమనకు బోధించిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల పాదపద్మాలకు నమస్కరిద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Gg